ప్రతిపక్షమే లేకుండా చేస్తున్నాం... మనకింకా తెలంగాణలో తిరుగేలేదు అంటూ ఒంటెద్దుపోకడ పోతున్న టీఆర్ఎస్ లో ఉన్నట్టుండి ప్రకంపనలు మొదలయ్యాయి. తమకు ప్రత్యర్థిగా రాజకీయ శక్తి ఏదీ లేదని హ్యాపీగా ఫీలవుతున్న టీఆర్ఎస్ కు ఊహించిన రీతిలో రాజకీయేతర శక్తి సవాల్ విసరడంతో కేసీఆర్ లోనూ కొంత చలనం వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ సాధనలో ఎవరి సహాయం తీసుకున్నారో ఇప్పుడదే టీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుటా ఎగిరేసేసరికి జాగ్రత్తపడకపోతే ప్రమాదమని కొంతలో కొంతైనా సర్కార్ లో చలనం మొదలయింది.
ఇప్పటి వరకు ఎవరెన్ని విమర్శలు చేసినా అంతగా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలంతా ఒక్కసారిగా తమ నోళ్లకు పనిచెప్పడం చూస్తే వారిలో వణుకు మొదలయిందన్నది సుస్పష్టం. ఇన్నాళ్లు సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతే జేఏసీతో ఏమవుతుంది, కోదండరాం ఒంటరివాడు అని అంతగా పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో పునాది వేసుకుని అందరిని ఏకం చేసుకుని ఒక్కసారిగా దండయాత్ర మొదలుపెట్టాడు కోదండరాం. ఇన్నాళ్లు మౌనంగా ఉంటే ఆయన పనయిపోయింది అంటూ చులకనగా చూసారు, పట్టించుకోవడం మానేసారు. కాని మేధావి మౌనం దేనికి దారితీస్తుందో అన్న కోణంలో కేసీఆర్ ఆలోచించలేదు.
ఏమి చేస్తాడులే అనుకున్న మనిషే ఏకంగా నోరు తెరిచి పాలించడం చేతకాకపోతే గద్దె దిగు అని గద్దించే సరికి గులాబీ దండు ఒక్కసారి ఉలిక్కిపడింది. వెంటనే ఎవరికి తోచినట్లు వారు ఏం మాట్లాడాలో తెలియక తికమక పడ్డా ఏదో ఓటి మాట్లాడాలి కాబట్టి కోదండరాంపై ఫైర్ అయ్యారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు టీఆర్ఎస్ రైట్ హ్యండ్ గా భావించే మంత్రి హరీష్ రావ్ తో సహా మంత్రులు ఈటెల, తలసాని, జగదీష్ రెడ్డి, కడియం శ్రీహరి, జోగురామన్న, పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ బాల్కసుమన్ వంటి టీఆర్ఎస్ హేమాహేమీలంతా కోదండరాంపై మాటల దండయాత్ర చేశారు.
టీఆర్ఎస్ అదికారంలోకి వచ్చాక ఒక్క సిఎం మినహా దాదాపు మంత్రి వర్గం అగ్రజులంతా ఇలా విరుచుకుపడడం ఇదే మొదటిసారి. అంటే కోదండరాం పెట్టిన సెగ టీఆర్ఎస్ కు అంటే కేసీఆర్ కు ఏమేరకు తాకిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందరు తలోరకంగా మాట్లాడినా అంతిమంగా వారి భావం ఒక్కటే. ఆయనెవరు, రాజకీయ పార్టీ ప్రతినిధా, ఓ సంస్థకు ప్రతినిధా, ఆయనతో ఏమవుతుంది, అయినా జేఏసీ ఆయన పెట్టారా, అదిప్పుడెక్కడుంది అనే. సరే ఇవన్నీ నిజమైతే ఇంతగా ఉలికిపాటెందుకు, లైట్ గా తీసుకుని మౌనంగా ఉండొచ్చు కదా.